ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగూడెం వైకుంఠధామంలో చీకటి దందా,,,,శ్మశానంలో చెట్ల నరికివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:01 PM

రాను రాను కొందరి కక్కుర్తికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డబ్బు సంపాదించటం కోసం పలువురు రకరకాల అడ్డదార్లు తొక్కుతున్నారు. ఓ వైపు పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రభుత్వాలు నెత్తీ నోరు కొట్టుకుంటుంటే.. మరోవైపు కొందరు ప్రబుద్ధులు మాత్రం ఉన్న చెట్లను కొట్టేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటివరకు అడవుల మీద పడిన ఆ అక్రమార్కులు ఇప్పుడు అక్కడ చెట్లు కొట్టటం వీలు పడకపోతుండటంతో.. ఇప్పుడు ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ గొడ్డలికి పని చెప్తున్నారు. చివరికి శ్మశానాన్ని కూడా వదలకుండా.. అక్కడున్న చెట్లు కూడా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే జరిగింది. అది కూడా.. ఫారెస్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే జరగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు పక్కన ఉన్న మున్సిపల్ వైకుంఠధామంలో ఉన్న టేకు చెట్లను కొందరు అక్రమార్కులు నరికేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో నాటిన టేకు చెట్లు.. ఏపుగా పెరగటంతో వాళ్ల దృష్టి ఆ వృక్షాలపై పడింది. రాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో.. కటింగ్ మిషన్ ద్వారా టేకు చెట్లను కోసి, వాటిని సైజులుగా తయారు చేసి, వాహనాల ద్వారా కలప మిల్లుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెట్లను కొసిన తర్వాత.. పనికొచ్చే దుంపలను తరలించి.. మిగితా కొమ్మలను అడ్డదిడ్డంగా వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.


అడ్డదిడ్డంగా వేసిన కొమ్మలు ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో.. ఆ కొమ్మలు అక్కడ ఎవరేశారన్నది చర్చకు వస్తోంది. దీంతో.. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే.. శ్మశానంలోని టేకు చెట్లను కొట్టేసి.. దందా నడిపిస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. అది కూడా.. అటవీ శాఖ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న శ్మశానంలో ఏపుగా పెరిగిన టేకు చెట్లు కొట్టేయటం మరింత చర్చకు దారి తీస్తోంది.


అయితే.. రామవరం గోధుమ వాగు వైకుంఠధామంలో రాత్రి సమయంలో జరుగుతున్న ఈ కలప దందా వెనక కొందరి రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ దందా అటు అటవీ శాఖ అధికారులకు.. ఇటు రవాణా శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న.


ఈ చెట్ల నరికివేత అంశంపై స్పందించిన రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. టేకు చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. అటవీ సంపదను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని శ్రీనివాస రావు తెలిపారు. చెట్లు నరికివేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa