పండగలు వచ్చాయంటే షాపింగ్ మాల్స్, ఇ-కామర్స్ సంస్థలు జనాలను ఆకట్టుకోడానికి బోలెడన్ని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కిలో చీరలు, వన్ ప్లస్ వన్, 50 శాతం డిస్కౌంట్లు, గోల్డ్ కాయిన్లు, లక్కీ డ్రాలు ఇలా ఒకటేమిటి అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఇక, తెలంగాణలో దసరా వచ్చిందంటే గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. అయితే, బతుకమ్మ, దసరా నేపథ్యంలో గ్రామాల్లో స్పెషల్ లక్కీ డ్రా పేరుతో కొన్ని ఆఫర్లు పుట్టుకొచ్చాయి. కొందరు యువకులు కలిసి ఇలాంటి స్కీమ్లను ప్రతి సామాన్యుడిని ఆకర్షించేలా ప్రవేశపెడుతున్నారు.
దసరా అంటే ప్రతి ఇంట్లో దాదాపు మటన్ బొక్కాలు, మద్యం ఉండాల్సిందే. ప్రస్తుతం మటన్ కిలో రూ.800 నుంచి వెయ్యి వరకు పలుకుతోంది. మద్యం ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని అసరాగా చేసుకుని కొందరు యువకులు గ్రామాల్లో లక్కీ డ్రాలు పెట్టి, మొదటి 10 మందికి బహుమతులంటూ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇందులో మటన్, మద్యం వంటి బహుమతులు గెలుచుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక పొట్టేలు కొనాలంటే రూ.10 వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో రూ.100 కొట్టు పొట్టేలు పట్టు అంటూ గ్రామాల్లో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. తండాల్లో రూ.50లకు లాటరీ టికెట్ కొంటే మేకను గెలుచుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. రూ.100, రూ.50గా టికెట్ ధరను నిర్ణయించి.. గరిష్టంగా వెయ్యి మందికి మాత్రమే స్కీమ్లో అవకాశం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రకటనలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రూ.100 టిక్కెట్ను వెయ్యి మంది కొంటే లక్ష రూపాయిలు అవుతుంది. మొత్తం పది మందికి బహుమతులు ఇస్తామని చెప్పడంతో రూ.50 వేలు ఖర్చయినా.. మరో రూ.50 వేలు మిగులుతుంది. దీంతో ఇదే మంచి అవకాశంగా గ్రామాల్లో ఈ లాటరీ స్కీమ్స్ పుట్టుకొచ్చాయి. టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 కావడంతో వీటికి కొనేందుకు జనగం ఎగబడుతున్నారు.
పోతే వంద గెలిస్తే పొట్టేలు.. మనకే ఆ అదృష్టం కలిసొస్తుందేమోననే ఆలోచనతో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా, మంచిర్యాలలోని ఒక గ్రామంలో పెట్టిన లాటరీలో మొదటి బహుమతి ఫ్రిజ్, రెండో బహుమతి పొట్టేలు, మూడో బహుమతి మేకపోతు, నాలుగో బహుమతి జానీవాకర్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి బ్లాక్డాగ్ ఫుల్ బాటిల్, ఆరో బహుమతి 100 పైపర్స్ ఫుల్ బాటిల్, ఏడో బహుమతి కింగ్ ఫిషర్ లైట్ కాటన్ బీర్లు, ఎనిమిదో బహుమతి నాటుకోడి పుంజు, 9వ బహుమతి నాటుకోడి పెట్ట, 10వ బహుమతి బాయిలర్ కోడిగా నిర్వహకులు ప్రకటించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa