సంచలన నిర్ణయాలతో పాలనతో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో బుల్డోబర్లు దింపుతున్న సర్కార్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది.. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు ఇరుకుంగా ఉండటంతో పాటు.. సెట్ బ్యాక్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనధికార లేఅవుట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా కింద బదిలీ చేయడంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తోంది.
ఇబ్రహీంపట్నం ఆదిభట్లలోని జీపీ లేఅవుట్లో చట్టబద్ధతలను విస్మరించి 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన శ్రీనివాస్రెడ్డి వంటి మధ్యతరగతి కుటుంబాలకు ఈ సమస్య బాధ కలిగించింది. శ్రీనివాస్ రెడ్డి తన కుమార్తె వివాహంలో భాగంగా ప్లాట్ను తన అల్లుడికి బహుమతిగా ఇవ్వాలని భావించాడు. అయితే ప్లాట్ని నిషేధిత జాబితాలో చేర్చడం వలన దాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా ఆగిపోయింది. ప్లాట్ బహుమతిగా ఇవ్వాలనుకున్నానని.. కానీ ఇప్పుడు అది భారంగా మారిందని.. ఏం చేయాలో తెలియడం లేదంటూ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
చట్టం ప్రకారం, లేఅవుట్లను మంజూరు చేసే అధికారం హెచ్ఎండీఏతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కి మాత్రమే ఉంది. గ్రామ పంచాయతీలకు కాదు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటుకు ముందే ఈ జీపీ లేఅవుట్లలో చాలా వరకు అనుమతులు లభించాయి. అయితే చనిపోయిన సర్పంచ్లు, సిబ్బంది సంతకాల ఫోర్జరీతో ముందస్తు లేఅవుట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు.
సాధారణంగా.. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, మతపరమైన ట్రస్ట్ భూములు అనధికార రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి 22-A జాబితా కిందకు వస్తాయి. ఇటీవల ఈ జాబితాలోకి జీపీ లేఅవుట్లను చేర్చడంతో చాలా మంది భూయజమానులు తమ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa