దసరా వేళ తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ కానుకను ఇస్తోంది. గతంలో ప్రకటించినట్టుగానే.. ఈరోజు (అక్టోబర్ 11న) తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. మొదటి దశలో భాగంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంఖుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగానే.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కోందుర్గులో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యాశాఖ బలోపేతం కోసమే.. కొత్త నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆందులో భాగంగానే.. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను చేపట్టామని తెలిపారు.
మరోవైపు.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించామనన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. మొత్తంగా.. 5 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భట్టి వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం పెరుగుతుందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు భోదన అందించేలా.. సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మంత్రి శ్రీధర్ బాబు శంఖుస్థాపన చేశారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాల భవనాలకు శ్రీకారం చుట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందించటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తున్నామని.. రైతులకు రుణమాఫీ చేసి చూపించమని మంత్రి తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మెగా డీఎస్సీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశినట్టు వివరించారు. పదేళ్లపాటు ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa