దసరా పండుగ రోజున రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ సర్కారు తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ.20 వేలకోట్లు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఐదేళ్లలోపు మొత్తం లక్ష కోట్ల రూపాయలను స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేకుండా అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రంతో పాటుగా, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజాన్ని నడిపించే స్థాయికి మహిళలు ఎదగాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ను భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.36.50 కోట్ల వ్యయంతో 2.5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసేలా దీనిని ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క.. కాలుష్య రహితంగా 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు చేపడుతున్నామన్న డిప్యూటీ సీఎం.. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న భట్టి విక్రమార్క.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరకొరగా రుణమాఫీ చేసిందని విమర్శించారు. కానీ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
మరోవైపు డిసెంబర్ 9వ తేదీలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని వివరించారు. అలాగే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ పామాయిల్ సాగు చేస్తామని.. అందుకు అనుమతులు కూడా వచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక 1986లో ఎన్టీఆర్ పెదవేగిలో మొక్క నాటారన్న తుమ్మల నాగేశ్వరరావు.. 1990 తర్వాత తెలంగాణలో వేసినట్లు గుర్తు చేశారు. పామాయిల్ సాగు విషయంలో అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa