రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో 18ను శుక్రవారం జారీ చేశారు. ఈ సర్వే ప్రక్రియ బాధ్యతను నోడల్ విభాగంగా ప్రణాళిక శాఖకు అప్పగించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు కుటుంబ సర్వే నిర్వహించాలని ఫిబ్రవరి 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనిని శాసనసభ ముందుకు తీసుకొచ్చిన ఆమోదించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సమగ్ర కుల గణనకు బీసీ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల కొత్త కమిషన్ ఏర్పాటైన తరువాత ప్రక్రియను మరింత వేగం చేసింది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియలు, బిహార్లో చేపట్టిన కుల గణనను ప్రభుత్వం పరిశీలించింది. రాష్ట్రంలో కుల గణన వెంటనే చేపట్టాలని ఇటీవల బీసీ కమిషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే, ఇందుకు తగిన యంత్రాంగం లేదంటూ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ ఈ సందర్భంగా వివరించారు.
దీంతో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం... ప్రణాళిక విభాగంతో కలిసి కులగణన నిర్వహించాలని ఆదేశించారు. సర్వేను 60 రోజుల్లోగా పూర్తి చేయాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాతే ప్రక్రియ వేగం పుంజుకొని తాజాగా ఉత్తర్వులు వెల్లడయ్యాయి. దసరా తర్వాత సర్వే ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణనకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చేసిన వాగ్దానానికి కట్టుబడి 60 రోజుల్లో సర్వే పూర్తి చేసేలా ఆదేశాలిచ్చారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మరోవైపు, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కొద్ది రోజుల కిందట కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. ఇందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ను కమిషన్ చీఫ్గా నియమించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి, 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ కమిషన్ నివేదిక కూడా కీలకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa