మూసీ నిర్వాసితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో శుభవార్త వినిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మూసీని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలంతా చెప్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి తరలించటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టాస్క్గా మారింది. అటు నిర్వాసితులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో.. నిర్వాసితులకు డబులు బెడ్ రూం ఇండ్లు ఇస్తామని.. ఖర్చులకు గానూ 25 వేలు కూడా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే.. ఇప్పటికే కొందరు డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వెళ్లినట్టు ప్రభుత్వం చెప్తుండగా.. మిగతా వారు ఇంకా ఒప్పుకోకపోవటం గమనార్హం.
అయితే.. మూసీ నిర్వాసితుల కోసం అవసరమైతే.. రేసింగ్ కోర్టు, అంబర్ పేట పోలీస్ బెటాలియన్ను శివార్లలోకి తరలించి అక్కడ.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. మూసీకి సమీపంలోనే.. అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ టవర్స్ నిర్మించి.. నిర్వాసితులకు అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఆదివారం(అక్టోబర్ 27న) రోజున హైటెక్ సిటీలో నిర్వహించిన ఓ ప్రాపర్టీ షోకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణపై కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మూసీ నిర్వాసితుల కోసం నదికి సమీపంలోనే రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. ప్రభుత్వమే నిర్మించే ఈ రెసిడెన్షియల్ టవర్స్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. వీటితో పాటు.. మూసీ నిర్వాసితుల పిల్లలు చదువుకునేందుకు పాఠశాలల ఏర్పాటు, మహిళాలకు స్వయం సహాయక సంఘాలు, చిన్న తరహా వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇదిలా ఉంటే.. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులు పెడుతోందంటూ.. ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతున్నాయని భట్టి విమర్శించారు. ఉన్న ఇంటిని లాక్కొని.. వేరే దగ్గర ఇళ్లు ఇస్తామంటున్నారంటూ.. నిర్వాసితులను ఆందోళనకు గురి చేస్తున్నారంటూ భట్టి విక్రమార్క మండిప్డడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa