ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు చనిపోయిన విషయం తెలియక.. 3 రోజులుగా దీన స్థితిలో అంధ దంపతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 10:52 PM

కుమారుడు మృతి చెందిన విషయం తెలియక.. మూడు రోజులుగా అంధకారంలో ఉండిపోయారు అంధ వృద్ధ దంపతులు. మనసు కలచివేసే ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. నాగోలు డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ (65), శాంతకుమారి (60) అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొకచోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్ (30) తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. అయితే.. చిన్న కుమారుడు ప్రమోద్‌కు వివాహం జరగ్గా.. పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో.. మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం అండగా ఉంటూ.. వారి ఆలనా పాలన చూసుకుంటూ ఉండేవాడు.


అయితే.. విపరీతంగా మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయినా మద్యం తాగటం మానేయకపోవటంతో.. ఆ మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే.. తమ కుమారుడు చనిపోయినట్టుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవటం.. వృద్ధాప్య దశలో ఉన్న వారికి చూపు కూడా లేకపోవటంతో.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అటు వైపు ఎవరూ కనీసం తొంగికూడా చూడకపోవటం శోచనీయం.


అయితే.. మూడు రోజుల కింత చనిపోవటంతో.. మృతదేహం కుళ్లిపోయి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. అప్పుడు స్థానికులు గమనించారు. దీంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నాగోలు సీఐ ఏ సూర్య నాయక్, ఎస్సై శివ నాగ ప్రసాద్‌, తన బృందంతో సంఘటన స్థలాన్ని సందర్శించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే ఇంటి తలుపులు తొలగించి ఇంట్లో ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు.


ఆ వృద్ధ దంపతులకు స్నానం చేపించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్న కొడుకు ప్రమోద్ చనిపోయాడని తెలియజేశారు. ప్రమోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో కొడుకు ప్రదీప్‌ను పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు. బ్లెండ్స్ కాలనీలో ఒక వ్యక్తి చనిపోయి మూడు రోజులవుతున్నా.. దుర్వాసన వస్తున్నప్పటికీ ప్రజలు ఎవరు పట్టించుకోకపోవటం శోచనీయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa