ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ..రాష్ట్రమంతా పండగే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 07:27 PM

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 07న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. కాగా.. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిచినట్టు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్రజా విజయోత్సవాలను ఏ విధంగా జరపాలి.. ఏ అంశాలపై ప్రచారం చేయాలనే విషయాలపై విధివిధానాలు రూపొందించేందుకు భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం (నవంబర్ 09న) కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.


ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రోడ్ మ్యాప్‌ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రజా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలు వినిపించేందుకు సర్కార్ సిద్ధమైంది. అయితే.. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా.. నవంబర్ 28న పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగానే.. పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే.. గ్రూప్-4కు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.


మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజయిన నవంబర్ 14న ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజయిన డిసెంబర్ 9వ తేదీ వరకు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. కాగా.. చివరి రోజున డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ నగరంలో భారీగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ 25 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పలు కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల వివరాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ప్రజలకు వివరించే వేదికగా ఈ ప్రజా విజయోత్సవాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. ఈ విజయోత్సవాలను రాష్ట్రంలోని గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa