ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ జిల్లాలో భారత్‌మాల రోడ్డు నిర్మాణం.. రైతుల భూములకు సర్వీస్ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 10:23 PM

కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ది కోసం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017లో కేంద్రం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టును తీసుకొచ్చింది. అయితే ఈ రహదారి గద్వాల జిల్లా గుండా కూడా వెళ్తోంది. ఈ మేరకు జిల్లాలోని భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం (నవంబర్ 5) పరిశీలించారు. గట్టు మండలంలోని తప్పెట్లమొరుసు, ఆరగిద్ద గ్రామంలో పనులను పరిశీలించారు. హైవే అథారిటీ అధికారులతో కలిసి రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలు, భారత్ మాల రహదారి మ్యాపింగ్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం స్థానిక రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన భూములకు సర్వీస్‌ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు కలెక్టర్‌ను డిమాండ్‌ చేశారు. రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన కనెక్టివిటీ అందిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించారు.


వరంగల్‌కు రింగు రోడ్డు


ఇక వరంగల్‌ పట్టణ అభివృద్ధిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వరంగల్‌ నగరాన్ని తెలంగాణకు హైదరాబదాద్ తర్వాత రెండో రాజధానిగా ప్రకటించేందుకు కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన మంత్రి పొంగులేటి.. వరంగల్‌ పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్రానికి రెండో రాజధానిగా నిలుపుతామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం తాజాగా ప్రణాళికలు రచిస్తోందని చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలోనే.. వరంగల్, హనుమకొండ అభివృద్ధిపై మంగళవారం (నవంబర్ 05న) మంత్రులు సమావేశం నిర్వహించారు. వరంగల్ ఔటర్ రింగు రోడ్డు , ఇన్నర్ రింగు రోడ్డు లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ చర్చించారు. వరంగల్ పట్టణం చుట్టూ 41 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మొదటి దశలో 20 కి.మీ, రెండో దశలో 11 కి.మీ, మూడో దశలో 10 కి.మీ రహదారి నిర్మించున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa