ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హానీ ట్రాప్ వంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా.. ఓ యువతి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో అమాయకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి మంచి ఉద్యోగం, సమాజంలో గౌరవం ఉన్నాయి. అయితే అతడికి అనారోగ్యంతో బాధపడుతున్న భార్య ఉండటంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే భార్య సూచనతో మ్యాట్రిమోనీ సైట్లో రెండో వివాహానికి రెడీ అయ్యాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా.. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. కొద్ది రోజుల పాటు ఛాటింగ్లతో పాటుగా మాట్లాడుకున్నారు. అనంతరం ఇటీవల తనను కలిసేందుకు హైదరాబాద్ రమ్మని కోరింది. దీంతో అతడు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. ఆమె చెప్పిన అడ్రస్కు చేరుకున్న బాధితుడు నగర శివారులోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లాడు.
ఆమె అందంగా ఉండటం, మాటతీరు నచ్చటంతో చాలా సంతోషపడ్డాడు. అతడి వీక్నెస్ గమనించిన కిలేడీ లేడీ అతడి డెబిట్ కార్డుతో రూ.40 వేల వరకు షాపింగ్ చేసింది. అనంతరం బయటకు వచ్చి ఓ స్టార్ హోటల్లో భోజనం కూడా చేశారు. షాపింగ్, భోజనం అయిపోయాక.. మళ్లీ కలుద్దామని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒకరికొకరు నచ్చామనే అభిప్రాయం, ఆనందంతో బాధితుడు బాపట్ల వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే.. తన అమ్మమ్మ చనిపోయిందని మూడు నెలల వరకూ పెళ్లి తంతు జరగకూడదంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. ఆతర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసి అడ్రస్ లేకుండా పోయింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి వారు దగ్గరై బహుమతి కోరినా.. ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆచితూచి స్పందించాలన్నారు. ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa