తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో రేపటి నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఎలాంటి వర్షం హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
ఇక ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో మాత్రం కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో రేపు (నవంబర్ 17) కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. చలి ప్రభావంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ, పొగమంచు కమ్మేస్తోంది. పొగ మంచు కారణంగా తెల్లవారుజామున రహదారులపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలపై చలి తీవ్ర ప్రభావం చూపుతుండగా, ప్రయాణికులు సైతం వణుకుతున్నారు. పొగమంచులో ప్రయాణం మంచిది కాదని.. తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉదయం వేళల్లో పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. నగర శివారు ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు దిగువన పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశలో ఉపరితల గాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కాగా, చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలని.. అవసరం అయితేేనే బయటకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa