ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఊరిలో వరుస మరణాలు.. 26 దాటిన సంఖ్య, వాళ్లే ఎక్కువ.. రాత్రయితే చాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 06:58 PM

ఆ గ్రామంలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రాణాలు వదులుతున్నారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతున్నారు..ఆస్పత్రికి ప్రాణాలతోనే వెళ్తున్నారు కానీ వచ్చేటప్పుడు మాత్రం శవాలుగానే వస్తున్నారు. ఒక ఇంట్లో దీపం ఆరిపోయిందన్న బాధ చల్లారకముందే మరో ఇంట్లో చావు డప్పులు మోగుతూనే ఉన్నాయి. అందులోనూ.. ఆడమగ అనే తేడా లేకుండా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువగా ప్రాణాలు వదులుతున్నారు. నెల రోజులుగా ఇదే జరుగుతోంది. ఇప్పటికే 26 మంది వరకు చనిపోయారు. దీంతో.. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. కళ్ల ముందే తమ తోటి గ్రామస్థులు పిట్టల్లా రాలిపోతుంటే.. మిగతా జనాలు ఓవైపు ఏడుస్తూనే మరోవైపు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు.


అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఖలేజా సినిమాలో.. ఓ చిన్న గ్రామంలో జనాలు ఉన్నట్టుండి పిట్టల్లా రాలిపోతుంటారు. ఎందుకు చనిపోతున్నారో తెలియక.. ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడుకోలేక.. చనిపోతున్న వారి సంఖ్యను లెక్కపెట్టుకుంటూ ఆ గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. అచ్చంగా అలాంటి భయానక సన్నివేశాలే ఆ గ్రామంలోనూ నెలకొన్నాయి. ఇలాంటి భయానక పరిస్థితులు ఎక్కడో కాదు.. ములుగు జిల్లా జంగాలపల్లిలో నెలకొన్నాయి.


నెల రోజులుగా గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, వరుస మరణాలతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్థులంతా భయంతో గజా గజా వణికిపోతున్నారు. రాత్రయితే చాలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఇంటి ముందు లైట్లు ఆర్పేసి.. ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎవరి ఇంట్లో నుంచి ఎలాంటి వార్త వస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో గత నెల నుంచి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జంగాలపల్లిలో ఆడవాళ్లు, మగవాళ్లు కలిపి 26 మంది చనిపోయినట్టు చెప్తుండగా.. అందులో చాలా వరకు యుక్త వయసు వాళ్లే ఎక్కువగా ఉంటుండటం.. చనిపోయన వారందరికీ ఒకే రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించటం, అస్వస్థతకు గురైన రెండు మూడు రోజుల్లోనే ప్రాణాలు వదులుతుండటం.. గ్రామస్థులను మరింత కలవరపెడుతోంది.


ఈ విషయం గురించి గ్రామస్థులు మాట్లాడుతూ.. తమ ఊరిలో గత నెల నుంచి వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఆస్పత్రికి తీసుకుపోతే.. మాములుగా మారి తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండాపోయిందని నిస్పృహతో చెప్తున్నారు. వెళ్లేటప్పుడు ప్రాణాలతోనే వెళ్తున్నారని.. కానీ వచ్చేటపుడు మాత్రం శవాలుగా వస్తున్నారని విలపిస్తున్నారు. మరోవైపు.. గ్రామంలో జరుగుతున్న పరిణమాలతో.. ఊరికి ఏదో అరిష్టం పట్టిందని కొందరు పెద్దవాళ్లు అభిప్రాయపడుతుంటే.. చనిపోయిన వాళ్లందరికీ ఎవరో చేతబడి చేసుంటారని మరికొందరు వాపోతున్నారు. గ్రామానికి పీడ పట్టిందని.. గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని మరికొందరు పెద్దలు సూచిస్తున్నారు. ఊళ్లో ఏదో తిరుగుతుందని.. గ్రామ దేవతను శాంతి పర్చాలని మరికొందరు భూతవైద్యులు చెప్తున్నారని తెలిపారు. అయితే.. గ్రామస్థులు మాత్రం.. గ్రామ దేవతలకు తాము నిత్యం పూజలు చేస్తూనే ఉన్నామని.. మొక్కుబడులు క్రమంగా చెల్లిస్తూనే ఉన్నామని చెప్తున్నారు.


అయితే.. కాగా.. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్రామస్థులు ఇలా చనిపోవడానికి అంతు చిక్కని జబ్బులే కారణమని.. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాన్ని సందర్శించి.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలు అపోహలు పూర్తిగా తొలగించి మనోధైర్యం కలిగేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని యువత కోరుతున్నారు. అసలు వరుస మరణాలకు కారణాలేంటో తెలుసుకుని.. సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa