ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయట ఆహారం తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త, ఈ విషయాలు తెలుసుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 07:05 PM

చాలా మంది బయటి ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు. అయితే తినేది ఆహారమా.. విషమా..? అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు విపరీతంగా పెరుతున్నాయి. నగరంలోని నందినగర్ ప్రాంతంలో వారంతపు సంతలో మోమోస్ తిని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. షవర్మా తిని పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. ఆహార కల్తీతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.


బయట ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కుళ్లిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌ల్లో రోజుల పాటు నిల్వ ఉంచి ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ఫుడ్ సెప్టీ అధికారుల దాడుల్లో తేలింది. వంట గదిలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనపించిందని.. ఏమాత్రం నిబంధనలు పాటించటం లేదని గుర్తించారు. బయట ఆహారం తిన్న తర్వాత గంట నుంచి 36 గంటల వరకు ఎప్పుడైనా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.


కలుషిత ఆహారంలో ఉండే క్యాంపిలో బాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియాలు, నోరోవైరస్‌, సాల్మోనెల్లా, లిస్టెరియా వంటివి ఫుడ్‌ పాయిజింగ్‌కు కారణమవుతాయని చెబుతున్నారు. వివిధ రకాల డ్రగ్స్, టాక్సిక్స్‌తో ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులపై ఆహార కలుషితం తీవ్ర ప్రభావం చూపుతుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


వికారం, వాంతులు, వీరేచనాలు, ఆకలి లేకపోవడం, యూరిన్‌ నిలిచిపోవడం, కడుపులో నొప్పి, పొత్తికడుపు తిమ్మిరి, అధిక జ్వరం చలి, కండరాల నొప్పి ఫుడ్‌పాయిజనింగ్‌ లక్షణాలని అంటున్నారు. ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. వారికి వాంతులు, వీరేచనాలైతే వెంటనే ఓఆర్‌ఎస్‌ అందించాలని చెబుతున్నారు. అది లేకపోతే తగినంత ఉప్పు, పంచదార కలిపిన నీటిని తాగిస్తుండాలని అంటున్నారు. ఫ్రిజ్‌లో కూరగాయలు మధ్యలో పచ్చి మాంసం పెట్టడం సరైంది కాదని చెబుతున్నారు. అందులోని బ్యాక్టీరియా కూరగాయల్లో చేరుతుందని.. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌ సైతం తినొద్దని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa