ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ మోసం.. సినీ ప్రముఖులతో ప్రకటనలు, అమాయకులకు గాలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 08:26 PM

ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో రూపాయి రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి.. ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మెుహం చాటేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది.


స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడితో లాభాలు పంచుతామంటూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి తెర తీసింది. ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తిసింది. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధితులు వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌శర్మ, కల్పన మీడియాతో మాట్లాడారు.


సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ ఎండీ శ్రీధర్‌, డైరెక్టర్‌ దీప్తి తమ వద్ద డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లపై పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుందని నమ్మించారని వాపోయారు. బైబ్యాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారని సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24 శాతం అధికంగా చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్‌ తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. వారు చెప్పిన సమయం ముగిసినా తమకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా వారి ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేశారని వాపోయారు.


తమకు లాభాలు ఏం వద్దని.. చెల్లించిన అసలు నగదు ఇవ్వాలని అడిగితే అసభ్యపదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని వాపోయారు. తమపై దాడి కూడా చేసేందుకు సిద్ధమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు డిమాండ్ చేయటంతో తమకు చెల్లని చెక్కులిచ్చి మూడేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ ప్రముఖులతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇప్పించటంతో వాటిని చూసి తాము మోసపోయినట్లు తెలిపారు. తమను మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa