ఇటీవల కాలంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులు, అత్యాశపరులను టార్గెట్ చేసి నేరాలు చేస్తున్నారు. రోజుకో తరహా.. కొత్త మోసంలో సాధారన ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. నిన్న, మెున్నటి వరకు ఖరీదైన బహుమతులు, ఈ కేవైసీ, డ్రగ్స్ పార్శిల్ పేరిట మోసాలకు తెరలేపిన సైబర్ కేటుగాళ్లు తాజాగా.. వాట్సాప్ నెంబర్లకు లింకులు పంపించి మోసాలు చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే.. బాధితుల ఖాతాల్లో నగదును క్షణాల్లోనే ఖాళీ చేస్తున్నారు.
తాజాగా.. హైదరాబాద్ నగరంలో అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వాట్సాప్కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేసిన బాధితుడు క్షణాల్లోనే రూ.4.70 లక్షలు పోగొట్టుకున్నాడు. లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి (67) ఫ్లిప్కార్డ్ నుంచి ఇటీవల పార్శిల్ వచ్చింది. డెలివరీ చేసే కొరియర్ బాయ్ రోడ్డుపై నిలబడి బాధితుడి పేరును గట్టిగా పిలిచాడు. వెంటనే బాధితుడు ఇంటి పై అంతస్తు నుంచి కిందకి దిగాడు. ఆ కొరియర్ బాయ్ ప్రవర్తన తేడాగా అనిపించటంతో కొరియర్ ఆఫీసులో కంప్లైంట్ చేసేందుకు ఆన్లైన్లో నంబర్ వెతికాడు. అనంతరం ఆ నెంబర్కు ఫోన్ చేశాడు.
ఫోన్ ఎత్తిన అవతలి వ్యక్తి ఫిర్యాదు రుసుము కింద రూ.10 చెల్లించాలని కోరాడు. ఆ కొద్దిసేపటికే మరో నంబరు నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. ఫిర్యాదు చేసేందుకు ఫోన్పే ద్వారా రూ.10 చెల్లించాలని కోరాడు. బాధితుడు ఆ డబ్బు పంపించే ప్రయత్నంలో ఉండగానే సైబర్ కేటుగాడు వాట్సాప్ నెంబర్కు కస్టమర్కేర్ పేరిట ఓ ఏపీకే ఫైల్ పంపించాడు. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి క్లిక్ చేయమన్నాడు. ఫోన్లోని అవతలి వ్యక్తి చెప్పినట్లుగానే.. బాధితుడు ఆ ఫైల్పై క్లిక్చేశాడు. ఇలా క్లిక్ చేశాడో లేదో... అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.4.70 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
ఇదేంటని బాధితుడు అవతలి వ్యక్తిని ఫోన్లోనే నిలదీశాడు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, డబ్బు మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా.. ఫలితం లేకుండా పోయంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాట్సాప్ నెంబర్లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa