ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు.. బీఆర్ఎస్‌కు షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 07:25 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే, స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్‌ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో సింగిల్ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.


 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్‌‌లో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి వివేకానంద్‌లు హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది.


ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపు అంశంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను స్పీకర్‌ అనుసరించడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న సింగిల్ బెంచ్.. నాలుగు వారాల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9 న తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్ చేయాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది. ప్రోసిడింగ్స్ అనంతరం స్టేటర్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. లేకుంటే తామే సమోటోగా విచారణ జరపుతామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.


అయితే, ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దాఖలైన రెండు పిటిషన్ లపై హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబరు 12 న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావు తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. అంతేకాదు, స్పీకర్‌కు ఎటువంటి టైమ్ బాండ్ లేదని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో స్పీకర్ విచక్షణాధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు పరోక్షంగా వెల్లడించింది. ఇక, తుది నిర్ణయం స్పీకర్‌కే వదలిపెట్టడంతో పార్టీ మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట కలిగినట్టయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa