అధికారులు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సొసైటీల భూ కేటాయింపులను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని హౌసింగ్ సొసైటీలకు ప్రస్తుత, గత ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ రావు బీ చెలికాని అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. భూ కేటాయింపులను రద్దు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూకేటాయింపులపై సందిగ్ధత నెలకొంది.
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్) హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు పేట్బషీరాబాద్లోని 38 ఎకరాల భూమికి రేవంత్ ప్రభుత్వం కేటాయించింది. సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జర్నిలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్ అందజేశారు. ఉమ్మడి ఏపీలో సీఎం వైఎస్సార్ హయాంలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీకీ ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే 2008 మార్చిలో నిజాంపేట్లో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్లో 38 ఎకరాలను జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు.
కాగా నిజాంపేటలోని 32 ఎకరాల స్థలం సొసైటీ ఆధీనంలో ఉండగా.. పేట్బషీరాబాద్లోని 38 ఎకరాలకు సంబంధించిన ఇండ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్రెడ్డి అర్హులైన వారికి అందజేశారు. అయితే తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలు పొందిన ఈ భూముల విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa