శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. కాగా.. కార్తీక మాసం నుంచి మొదలుకొని.. మకర జ్యోతి దర్శనం సమయం వరకు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూనే ఉంటారు. ఈ క్రమంలో.. ఇప్పటికే భారీ సంఖ్యలో శబరిమలకు భక్తులు చేరుకుంటున్నారు. శబరిమలకు భారీ సంఖ్యలో వస్తున్న భక్తులతో.. క్యూలైన్లు పంబా వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది.
భక్తులు రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని.. కర్పూరం వెలిగించవద్దని భక్తులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. యాత్రికులు రైళ్ల కోచ్ల లోపల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందులో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతులు ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి వెలిగించడం వంటివి చేస్తున్నట్టు రైల్వే అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిపింది. అయితే.. ఇలాంటి కార్యక్రమాలు రైళ్లలో చేయొద్దని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉంటే.. శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరి మార్గమధ్యలో పలు స్టేషన్లలో ఆగనున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సహకారం కావాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. రైళ్లలో, రైలు ప్రాంగణాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేస్తుంది. మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణాలు చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణాలు చేస్తే.. అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రయాణికుల ప్రాణాలే కాకుండా.. రైల్వే ఆస్తులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు రైల్వే చట్టం-1989లోని సెక్షన్లు 67, 154, 164, 165 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. ఇటువంటి చర్యల వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహించడంతో పాటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa