ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పల్- నారపల్లి ఫైఓవర్ పనులు ప్రారంభం.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 06:24 PM

ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. వచ్చే నెలలో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్‌‌స్ట్రక్షన్‌‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరించడంతో కంపెనీ దిగొచ్చింది. దీంతో.. ఫ్లై ఓవర్ పనులను కంపెనీ ప్రారంభించింది. ఈ మేరకు ఆర్ అండ్ బీలోని ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు ప్రకటన చేశారు. నారపల్లిలోని సీపీఆర్‌‌‌‌ఐ దగ్గర సర్వీస్ రోడ్డు పనులను కంపెనీ ప్రారంభించింది. ఈ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌‌ను అనుమతించి ఫ్లై ఓవర్ పనులను చేపట్టన్నారు. త్వరలోనే ర్యాంప్ నిర్మాణం, పిల్లర్ల పనులను కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


అయితే.. 2018లో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ పనులు చేపట్టగా.. ఆరేళ్లు గడిచినా ఇప్పటి వరకు కేవలం 44 శాతం పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. పిల్లర్లు పూర్తి చేసి శ్లాబులు వేయాల్సి ఉందని తెలిపారు. మొత్తంగా 147 శ్లాబ్‌‌లు వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 37 మాత్రమే పూర్తయినట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నరలో ఈ పనులను మొత్తం పూర్తి చేయాలని కంపెనీకి అధికారులు గడువు విధించటంతో.. పనులు శరవేగంగా పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో.. 2026లో ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి.. ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


కాగా.. హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి, వరంగల్ మార్గంలో రద్దీని తగ్గించేందుకు గానూ.. ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, ఫిర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.600 కోట్లతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్‌ను.. నిబంధనల ప్రకారం 2020 జులైలో పూర్తి చేయాల్సింది.


అయితే.. మధ్యలో కాంట్రాక్ట్ సంస్థ దివాలా తీయటంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు ఏళ్లుగా అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ కారిడార్‌లో నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్లు తవ్వేసి ఉండటం, రోడ్డు మధ్యలో పిల్లర్లు నిర్మించి అర్ధాంతరంగా వదిలేయటంతో.. వర్షాలు పడినప్పుడు గుంతలు ఏర్పడి వాహనదారులు నరకం చూశారు. ఈ మార్గంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. కాగా.. ప్రస్తుతం ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కావటంతో.. ఆ మార్గంలో రకపోకలు సాగించే వారికి ఎట్టకేలకు ఉపశమనం లభించనుంది. ఏళ్ల నాటి కల సాకారం కానుంది. చూడాలి మరి.. ఈసారి అయినా నిర్విరామంగా పనులు సాగించి ఫ్లైఓవర్ పూర్తి చేస్తారా.. లేదా మళ్లీ ఏదైనా అడ్డంకులు వచ్చి ఆగిపోతుందా..?







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa