ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 05:52 PM

తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరిగంతేసే వార్త వినిపించింది. ప్రస్తుతం.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, హాస్టళ్లు, విద్యాసంస్థల్లో కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు.. తరచూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. సంక్షేమ హాస్టళ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. తనిఖీల పేరుతో హాస్టళ్ల బాటపట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు.. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టళ్లు, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. వాళ్లతో కలిసి భోజనాలు కూడా చేశారు.


ఈ క్రమంలో.. విద్యార్థలకు పోషకాహారంతో పాటు, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటి వరకు అమలవుతున్న డైట్‌లో పలు మార్పులు చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ఈ మేరకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్న విషయం తెలిసిందే. కాగా.. తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రత్యేక మెనూ ప్రకారం.. ఇకపై విద్యార్థులకు లంచ్‌లో నెలలో రెండు సార్లు మటన్‌తో పాటు నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్‌వెజ్ భోజనం పెట్టినప్పడు సాంబార్, పెరుగు కూడా పెట్టాలని నిర్ణయించారు. నాన్‌వెజ్‌‌‌‌‌‌‌‌ తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ కూడా వండనున్నారు. అయితే.. నాన్‌వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్‌లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇవ్వనున్నట్టు సమాచారం.


ఈ హాస్టళ్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా చిల్కూర్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి నుంచే.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్‌ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం.. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పిల్లల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.


 ప్రైవేట్ స్కూళ్లు వచ్చాక గురుకులాల ప్రభావం తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు డైట్ ఛార్జీలు పెంచలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామని వెల్లడించారు. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణలో గత కొంతకాలంగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు.. అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. అందులోనూ ఓ అమ్మాయి చనిపోవటం.. అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే.. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ప్రభుత్వం హస్టళ్ల తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa