తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్రంతో పలు రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై నివేదికలు అందించింది. అందులో పలు రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ఉన్న 16 రహదారులను అప్గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపింది.
ఈ 16 రాష్ట్ర రహదారుల్లో మన్నెగూడ- వికారాబాద్- తాండూర్- జహీరాబాద్- బీదర్ మధ్య అనుసంధాన రహదారికి సైతం చోటు దక్కింది. ఈ రహదారి పొడవు సుమారు 134కి మీటర్ల దూరం కాగా.. ఈ రోడ్డు పూర్తయితే తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మహర్ధశ పట్టనుంది. ప్రధాన పట్టణాలతో పాటుగా కర్ణాటకలోని బీదర్కు సైతం ఈ రహదారి గుండా ప్రయాణాలు మెరుగవుతాయి. హైదరాబాద్ నగర శివారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు మెుత్తం 46.40 కిలో మీటర్ల దూరం ఉన్న బీజాపూర్ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఈ రహదారి విస్తరణ తర్వాత ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.
మన్నెగూడ నుంచి వికారాబాద్ పట్టణం మీదుగా తాండూరు వరకు మెుత్తం 60 కిలో మీటర్లు ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తాండూరు మీదుగా హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాండూర్- జహీరాబాద్ మధ్యలో 60 కిలో మీటర్ల సింగిల్ రోడ్డు ఉండగా.. ప్రస్తుతం అది అధ్వానంగా ఉంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రహదారులను కనెక్ట్ చేసి జాతీయ హోదా గుర్తించి విస్తరించాలని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తాజా.. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ పట్టణాలకు రాకపోకలు సాఫీగా జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa