ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 14, 2025, 08:46 PM

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న సందర్భంగా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న అనంతరం ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమేనని.. దేశంలో 37 ఏళ్ల తర్వాత ఒక బోర్డు ఏర్పాటు జరిగిందని అర్వింద్ తెలిపారు.


పండగ రోజు ప్రధాని నరేంద్ర మోదీ.. అరుదైన బహుమతి ఇచ్చారని అర్వింద్ అభివర్ణించారు. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే కాకుండా ఇతర పంటలతో పాటు అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజీ యూనిట్లు కూడా రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గల్ఫ్ కార్మికులు వెనక్కి తిరిగి వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. పసుపు పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్‌కు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కృషి చాలా ఉందన్నారు. పసుపు పంటలపై అన్ని అంశాల్లో అవగాహన ఉన్న పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియామకం కావడం సంతోషకరమని తెలిపారు.


మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అర్వింద్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు.. మళ్లీ ఎప్పుడు వెళ్తారో తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అనేది భూస్థాపితం కాబోయే సమితి అని.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా అని విమర్శించారు. ఈ దేశాన్ని, తెలంగాణను కాంగ్రెస్, కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి అంతా.. ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, సంపాదనపై మాత్రమే ఉందని, అందువల్లే ఈ దేశం వెనుకబడిపోయిందని ఆరోపించారు.


పసుపు బోర్డు చుట్టూ అనేక రాజకీయాలు జరిగాయని, పసుపు బోర్డు విషయంలో తనను అనేక రకాలుగా టార్గెట్ చేశారని ధర్మపురి అర్వింద్ చెప్పుకొచ్చారు. పసుపు రైతుల ముసుగులో ఇండ్లపైకి, బండ్లపైకి గుండాలను పంపించి దాడులు చేయించారని చెప్పుకొచ్చారు. ఫ్రమ్ బాండ్ టు బోర్డు వరకు ఇదో ప్రస్థానం అని తెలిపారు.


మరోవైపు.. కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి కూడా ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు మాత్రం పోలేవని అర్వింద్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా..? అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం వల్లే పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలో సాకారమైందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. చేతనైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలను తుమ్మల తెరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మినీ కేసీఆర్‌లని ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. వీళ్లు కేవలం సొంత ఫామ్‌హౌసుల్లోనే వ్యవసాయం చేస్తారని.. బయట చేయలేరని.. కనీసం రైతులను పట్టించుకోరంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa