ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి నేపథ్యంలో పోలీసుల పటిష్ఠ చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 14, 2025, 10:55 AM

సంక్రాంతి నేపథ్యంలో నగరంలో చోరీలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.ప్రతీయేటా సంక్రాంతి పండగకు నగరంలో ఉంటున్న వారు ఐదు నుంచి ఏడు రోజులపాటు స్వగ్రామాలకు వెళ్తుంటారు. దీంతో నగరం సగం ఖాళీ అవుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల ముందే అంతర్రాష్ట్ర దొంగలు నగరంలో తిష్ఠవేస్తున్నారు. ప్రజలంతా పండగకు ఊరెళ్లగానే ఒకవైపు అంతర్రాష్ట్ర దొంగలు, మరోవైపు లోకల్‌ దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. అందినంత దోచుకొని నగరం దాటేస్తున్నారు. దొంగల ముఠాల ఆట కట్టించడానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘాతోపాటు గస్తీని ముమ్మరం చేశారు.కొన్నేళ్లుగా సంక్రాంతి(Sankranti) దొంగల ఆటకట్టించడానికి ప్రతీ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా 200 మంది పోలీస్‌ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. మూడేళ్లుగా సంక్రాంతి సమయంలో జరిగిన చోరీలను పరిగణనలోకి తీసుకొని, హాట్‌స్పాట్‌లను గుర్తించి పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఊరేళ్లేటప్పుడు సమాచారం ఇచ్చిన వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఆయా కాలనీలు, బస్తీల్లో పెట్రోలింగ్‌ పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. దొంగల ఆటకట్టించాలని లా అండ్‌ ఆర్డర్‌తో పాటు ఎస్‌వోటీ, సీసీఎస్‌ పోలీసులకు(CCS Police) ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 12న రాత్రి నుంచే పెట్రోలింగ్‌ వాహనాలు కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. మంటూ గస్తీ తిరుగుతున్నాయి.ఊరెళ్తున్న విషయం పోలీసులకు చెప్పడానికి కొంతమంది ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పోలీసుస్టేషన్‌కు వెళ్తే అక్కడ సిబ్బంది ఎలా స్పందిస్తారో.. తాము చెప్పింది పట్టించుకుంటారో.. లేదో.. ఒకవేళ ధైర్యం చేసి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు..? ఎలా వెళ్తున్నారు..? ఎప్పుడు వస్తారు..? ఇంట్లో ఎవరెవరుంటారు..? విలువైన వస్తువులు ఏం ఉన్నాయి..? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారేమోనని నగరవాసులు స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉన్నట్లు సమాచారం.


ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమల్లో ఉన్నా అది క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండగకు వారం రోజుల ముందునుంచే పోలీసులు పలు కాలనీల్లో ప్రచారం చేస్తున్నా, సమావేశాలు నిర్వహిస్తున్నా, కొన్నిచోట్ల కరపత్రాలు పంచినా ఊరెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ట్రై కమిషనరేట్‌ పరిధిలో చాలా పోలీసుస్టేషన్లలో ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. అయినా.. నిఘా విషయంలో రాజీ పడొద్దని, చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, దొంగల ఆట కట్టించాలని పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa