ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.. మంత్రి సంచలన కామెంట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 07:23 PM

తెలంగాణ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని.. పర్యటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్ చేశారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జూపల్లి కృష్ణారావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దని అధికారులకు మంత్రి సూచించారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని ఆదేశించారు. రైతు భరోసాపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిని ఏమాత్రం నమ్మొద్దని మంత్రి సూచించారు. గతంలో ఉన్న ఏ పథకాన్ని ఎత్తి వేయటం లేదని.. పైగా ఎన్నో కొత్త పథకాలు అమలు చేస్తున్నామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.


ఈ సందర్భంగా అధికారులకు జూపల్లి కృష్ణారావు కీలక హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 26 నుంచి ప్రారంభంకానున్న పథకాలకు లబ్దిదారుల ఎంపిక జాగ్రత్తగా చేయాలన్నారు. ఒకవేళ తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి హెచ్చరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని చెప్పారు. గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలని జూపల్లి ఆదేశించారు.


సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని.. కానీ సాగు యోగ్యం కానీ ఒక్క ఎకరాకు కూడా డబ్బులు ఇచ్చేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. అర్హులైన రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పుకొచ్చారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న వేళ పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. అది కేవలం విపక్షాల అసత్య ప్రచారం, అపోహ మాత్రమేనని తెలిపారు. రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేవి నిరంతర ప్రక్రియ అని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.


ఈ సందర్భంగానే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో కూడా తాను మంత్రిగా పని చేశానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో తన నియోజకవర్గంలో కూడా 1400 ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేసిన మంత్రి జూపల్లి.. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లెవ్వరూ ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు పరిమితంగానే నిర్మించిందని జూపల్లి కృష్ణారావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com