ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇండ్లకూ కటాఫ్.. ఇల్లున్నా సరే, వాళ్లందరికీ మళ్లీ ఛాన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 07:27 PM

తెలంగాణలో ప్రస్తుతం సర్వేల హడావుడి నడుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా.. ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. వీటి అమలు కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం కూడా.. సర్వేలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. మొదటి విడతలో.. ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ప్రకటించింది.


ఇప్పటికే ఓసారి పేదల కోసం ప్రభుత్వం కట్టిచ్చే ఇంటిని పొందిన లబ్దిదారులు.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రకటనకు ప్రభుత్వం మరో కీలక సవరణ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం.. 1994 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సవరణతో.. 1994కు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు కూడా.. ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. ఆ కటాఫ్‌ సంవత్సరం తర్వాత (1995) నుంచి.. ప్రభుత్వం ద్వారా ఇళ్లు పొందిన లబ్ధిదారులు మాత్రం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులవుతారని చెప్తున్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడు సాచురేషన్‌ పద్ధతిలో ఇండ్లు మంజూరు చేశారు. కాగా.. 2004 నుంచి పదేళ్ల వ్యవధిలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చినట్టు సమాచారం. అయితే.. ఆ మధ్య కాలంలో ప్రభుత్వం ద్వారా ఇళ్లు పొందిన వారు.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు లేదని ప్రభుత్వం తేల్చేసింది.


ఈ పథకం కింద ఇల్లు పొందిన వారి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున.. ఆ లబ్ధిదారులకు మళ్లీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధార్‌ నెంబర్‌తో కూడా లబ్దిదారుల వివరాలను అనుసంధానించినందున వడపోత సులభంగా జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.


అయితే.. 1995కు పూర్వం అర్బన్‌ పర్మనెంట్‌ హౌసింగ్, రూరల్‌ పర్మినెంట్‌ హౌసింగ్‌ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందేది. ఆ సమయం లబ్ది పొందిన ప్రజలకు గ్రామాల్లో పెంకుటిండ్లు నిర్మించి ఇచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఆవాస్‌ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సాయం అందించింది.


అయితే.. ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కా్ర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఇండ్లన్ని దాదాపు పెంకుటిళ్లే కావటం.. వాటికి 30 ఏళ్లు నిండటంతో అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినందున.. 1994కు ముందు ఇండ్లు పొందిన వారు కూడా అర్హులవనున్నారు. ఇప్పటికీ ఆ ఇండ్లల్లోనే ఉంటున్నవారికి.. దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com