ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న మిస్టేక్‌తో ,,,ఆరేళ్ల తర్వాత పట్టించిన వేలిముద్రలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 07:45 PM

చట్టం కళ్లుగప్పి ఎన్నేళ్లు తప్పించుకున్నా.. చివరకు కటకటాలు లెక్కించాల్సిందే. హైదరాబాద్ నగరంలో చోరీ చేసిన ఓ దొంగ విషయంలో అదే నిజమైంది. ఆరేళ్ల క్రితం భారీ చోరీకి పాల్పడి దర్జాగా తిరుగుతున్న దొంగ మరో కేసులో పోలీసులకు చిక్కాడు. వేలి ముద్రల ఆధారంగా ఆరేళ్ల క్రితం జరిగిన చోరీ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే.. 2019లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.18లోని ఓ ఒంటరి మహిళ ఇంట్లో చోరీ జరిగింది.


 ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు.. మహిళను బెదిరించి రూ.50 వేల నగదు, బంగారు, వజ్రాభరణాలు, ఏటీఎం కార్డు, పిన్‌ నంబరు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఆమె ఫోన్‌ను కూడా తీసుకొని ఆ తర్వాత దాన్ని అక్కడే పెట్టి వెళ్లాడు. అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంట్లో క్లూస్ సేకరించారు. ఫోన్‌పై ఉన్న వేలి ముద్రలు తీసుకున్నారు. అయితే విచారణ చేపట్టినా.. దొంగ ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు దొంగను పట్టుకోలేకపోయారు.


అయితే గతేడాది డిసెంబరులో నగరంలోని ఓ హాస్టల్‌లో ఫోన్లు చోరీ కేసులో నేపాల్‌కు చెందిన గోవింద్‌ బండరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు లక్డీకపూల్‌లో ఉంటుండగా.. అతడిని అదుపులోకి తీసుకొని 51 ఫోన్లను రికవరీ చేశారు. ఆ సమయంలో అతని వేలిముద్రలను సేకరించారు. పాత కేసులు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపారు. అనంతరం బెయిలుపై గోవింద్‌ బండారీ విడుదలయ్యాడు. ఇతని వేలిముద్రలు 2019లో జూబ్లీహిల్స్‌ దోపిడీకి సంబంధించిన వేలిముద్రలతో మ్యాచ్ కావటంతో అప్పట్లో దొంగతనం చేసింది బండారీనే అని నిర్ధారించారు.


కూకట్‌పల్లిలోని తన సోదరి వద్ద ఉన్నాడన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఆ దొంగతనం చేసింది తానే అని ఒప్పుకున్నాడు. డార్జిలింగ్‌కు చెందిన రాజేష్‌ ఛత్రీ అనే వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. చోరీ చేసిన తర్వాత నగలను విక్రయించి ఇద్దరూ సమానంగా పంచుకున్నట్లు చెప్పాడు. ఏటీఎం కార్డు ద్వారా రూ. 5వేలు విత్‌డ్రా చేసినట్లు వెల్లడించారు. బండారీ 2019లో పాస్‌పోర్టు లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. 2020లో ఆర్‌సీపురంలో గ్రామీణ బ్యాంకు చోరీకి మరికొందరితో కలిసి విఫలయత్నం చేసినట్లు తెలిపాడు. జూబ్లీహిల్స్, బాలానగర్‌, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో ఇతడిపై 14కు పైగా కేసులున్నాయన్నారు. ప్రస్తుతం రాజేష్‌ ఛత్రీ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com