ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది.. కూనంనేని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 07:30 PM

తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలుపుకుపోతామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకు వెళ్తామన్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు.


ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామని తెలిపిన కూనంనేని.. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో అత్యంత దారుణంగా చంపేస్తున్నారని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.


ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకోవడంలో వైఫల్యం చెందిందని కూనంనేని చెప్పుకొచ్చారు. సమన్వయం చేసుకోవడంలో ఫెయిలైందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీల కలయికతోనే విజయం సాధించిందన్న విషయాన్ని హస్తం పార్టీ మర్చిపోతుందంటూ సున్నితంగానే చురకలంటించారు. దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చూస్తున్నారు కానీ.. కలుపుకోవడం తెలియడం లేదన్నారు.


కులగణన సర్వే రిపోర్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంగా ప్రకటించిందని.. అందుకు సంతోషం వ్యక్తం చేశారు కూనంనేని. అయితే.. అందులో బీసీలు తగ్గారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని.. గ్రామ సభల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలన్నారు. ఎస్సీ కులగణనలో చిన్న చిన్న లోపాలున్నాయని తెలిపిన కూనంనేని.. వాటిని రీ వెరిఫై చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె దిశగా ఆలోచనలు చేస్తున్నారని.. వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్నచోట పోటీ చేస్తామన్న కూనంనేని.. కుదిరిన చోట కాంగ్రెస్ పార్టీతో కలుపుకుపోతామని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని తెలిపుతున్నామని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీలకు ఇంకా చర్చలు సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసినవి చెప్పుకోవడం చేత కావడం లేదని కూనంనేని చెప్పుకొచ్చారు. రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేసినా కూడా చెప్పుకోవడం లేదన్నారు. అయితే.. 2 లక్షల మేర రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొంత వైఫల్యం చెందిందని కూనంనేని అభిప్రాయపడ్డారు.


కొన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందని తెలిపారు. అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా కూడా వేస్తున్నారని చెప్పుకొచ్చారు. మోడల్ విలేజీల్లో ఇల్లు కూడా కట్టిస్తున్నారని.. కానీ చేసినవి చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వంలో ఎవ్వరు ఫోన్ కాల్స్ అటెండ్ చెయ్యడం లేదని.. ప్రభుత్వం దీన్ని గమనించాలంటటూ కూనంనేని సాంబశివ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు.


మరోవైపు.. మావోయిస్టులను అంతం చేసేందుకు మార్చి నెలలో ముహూర్తం పెట్టారన్న విషయాన్ని గుర్తు చేసిన కూనంనేని.. ముహూర్తాలు ఎవరు పెడతారు.. ఎందుకు పెడుతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా మావోయిస్టులను మట్టుపెట్టడానికి ముహూర్తాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సంఘవిద్రోహులేమో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు.. ప్రజలకోసం పనిచేసే మావోయిస్టులను చంపేస్తారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా హత్యలు చేస్తున్నట్టేనని.. అతనిపై విచారణ చేయాలని కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa