మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలంటూ రఘనందన్ రావు ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతగానితనం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కులగణన సర్వేలో పాల్గొనని వారందరినీ సామాజిక బహిరష్కరణ చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా అంటూ ప్రశ్నించారు. సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని రఘనందన్ రావు చెప్పుకొచ్చారు.
బీసీల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. తన కేబినెట్లో ఎంతమందికి స్థానం ఇచ్చారంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో మాత్రం ఇద్దరే ఇద్దరు బీసీ మంత్రులున్నారని ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు హితవు పలికారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని రేవంత్ రెడ్డి ఇప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడుతుంటే నవ్వొస్తుందంటూ రఘునందన్ సెటైర్లు వేశారు.
అంతకుముందు గాంధీ భవన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పుకొచ్చారు. మోదీ పుట్టుకతోనే ఉన్నత కులమని చెప్పారు. 2002లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని ఓసీ నుంచి బీసీల్లో చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa