ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటివరకు రేవంత్ రెడ్డే సీఎం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 07:35 PM

తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఓ నేత ఏ బాంబు పేల్చుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గత కొంతకాలంగా కులగణన సర్వే, ఎస్పీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్ అంశాలపై జోరుగా చర్చ నడుస్తుండగా.. పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సందర్భంగా.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణకు రానున్న రోజుల్లో బీసీ సీఎం వస్తారని.. ఈ ఐదేళ్లు మాత్రం రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ అజెండాగానే జరుగుతాయని జోస్యం చెప్పారు. అయితే.. బీసీ ముఖ్యమంత్రి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని.. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.


తెలంగాణలో కులగణన చేయడంతోనే తమ నిబద్ధతను నిరూపించుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా కులగణన చేయలేదని దుయ్యబట్టారు మహేష్ కుమార్. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా అవకాశం ఉంది కానీ చేయడం లేదని విమర్శించారు. కులగణన సర్వేకు చట్టబద్ధత తీసుకొచ్చి కేంద్రానికి పంపిస్తామని.. దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి బీజేపీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బీసీనే అని.. ఆయనే ప్రధాని మోదీతో మాట్లాడి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చేలా ఒప్పించాలని సూచించారు.


ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిపారు. వచ్చే ఎన్నికలు కూడా బీసీ అజెండాగానే ఉంటాయని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa