ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు,,,జంక్షన్ల వద్ద భూములకు భారీ డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 07:20 PM

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు.. తెలంగాణ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కాబోతుందంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే.. హైదరాబాద్‌ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుతో నగర శివారు ప్రాంతాల్లోని భూములకు భారీగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగానే లాభాలు గడించారు. అయితే.. ఇప్పుడు రీజినల్ రింగు రోడ్డు వస్తుండగా.. రోడ్డు వెళ్తున్న ప్రాంతాల్లో భూములకు మంచి డిమాండ్ పలుకుతోంది. కాగా.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కాస్త ఢల్‌గా ఉండగా.. భవిష్యత్తులో మాత్రం మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో.. రియలర్ ఎస్టేట్ వ్యాపారులు.. ముందు జాగ్రత్తగా.. రీజినల్ రింగు రోడ్డు జంక్షన్ల వద్ద భూములను కొనేసి పెట్టుకుంటున్నారు.


మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా.. ఆయా ప్రాంతాల్లో భారీ వెంచర్లు వేసేందుకు అనుగుణంగా.. ఎకరాలకు ఎకరాలు కొనేందుకు బేరసారాలు నడుపుతున్నట్టు సమాచారం. అయితే.. రీజినల్ రింగు రోడ్డు లాంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కి.. పూర్తి చేసేందుకు కనీసం 10 నుంచి 20 ఏళ్లయినా పట్టే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడే భూములు కొనేసిపెట్టుకుంటే.. ప్రాజెక్టు పూర్తయిననాటికి.. ఊహించనన్ని లాభాలు వస్తాయని ఫ్యూచర్ చూస్తున్నారు రియల్టర్లు. ఓఆర్ఆర్‌ రియల్ ఎస్టేట్‌ వ్యాపారులకు గతంలో గడించిపెట్టిన లాభాలను దృష్టిలోపెట్టుకున్న రియల్టర్లు.. ఆర్ఆర్ఆర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఆర్ఆర్ఆర్‌ను మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ తలపించింది. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ చేసేలా.. రీజినల్ రింగు రోడ్డులో 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ ఛేంజర్స్‌తో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగే మంచి అవకాశం ఉందని ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే ఈ ఇంటర్ ఛేంజర్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భేరసారాలు నిర్వహిస్తున్నారు.


ప్రస్తుతం.. ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు చుట్టూ రోడ్ ఫేసింగ్‌తో ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు పలుకుతుండగా.. కొన్ని చోట్లా ఇంకాస్త ఎక్కువే ఉంది. అందులోనూ విజయవాడ హైవే, ముంబయి హైవేల వైపు ఉండే ఇంటర్ చేంజర్స్ దగ్గర ఎకరం సుమారుగా 3 కోట్లకు చేరుకుంది. రోడ్డు నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కూడా ఎకరం స్థలం కోటి నుంచి కోటీ 30 లక్షల వరకు పలుకుతుండటం గమనార్హం. ఒకవేళ.. రీజినల్ రింగ్ రోడ్డు పనులు పట్టాలెక్కితే మాత్రం.. భూముల ధరలకు రెక్కలు రావటం ఖాయమంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నవాళ్లంతా... కొంచెం డిమాండ్ పెరిగినట్టు అనిపించటంతోనే భారీ వెంచర్లు వేసి.. అమ్మకానికి పెట్టి భారీ లాభాలు ఆర్జించాలని చూస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa