ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిటీలో రోజురోజుకి పెరుగుతున్న దోమల బెడద

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 10:38 AM

హైదరాబాద్ సిటీ దోమలతో అట్టుడికిపోతుంది, ఎక్కడ చుసిన భయంకరమైన దోమలు ప్రజలని చుట్టుముడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ పరిధిలో దోమలు పెరగడానికి చాల కారణాలే ఉన్నాయి. ఇటీవల కాలంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు దోమల సీజన్ మొదలవ్వగానే,సిటీ అంతటా వారానికి రెండు మూడు సార్లు అయిన ఫాగింగ్ జరిగేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న దోమల తాకిడికి తగ్గట్టు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తుంది. సాయంత్రం ఆరు దాటాక బయటకి వస్తే దోమల దెబ్బకి పలహారం అయిపోవడం ఖాయం అని సోషల్ మీడియాలో ప్రజలు ఒకరికి ఒకరు హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు.దోమల బెడదకు నిద్రలు లేక సిటీ వాసులు అవస్థలు పడుతున్నారు.వర్షాకాలం నుండి దోమలు రావడం సహజం కానీ, చలికాలం వెళ్ళిపోయాక కూడా దోమలు విజృంభించడం అనేది పూర్తిగా జీహెచ్‌ఎంసీ వైఫల్యం అనే చెప్పాలి. ప్రజలని పట్టించుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ మాత్రం మొద్దు నిద్రపోతుంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోజు డ్రైనేజీ శుభ్రం చెయ్యడం, మరుగు నీటిని మళ్లించడం లాంటి పనులు చేసేవారు, కానీ గత ఏడాదిగా ఇవన్నీ ఆగిపోయాయి. చాల చోట్ల డ్రైనేజీ మురుగు నీరు రోడ్ మీదనే పారుతున్నాయి. రోడ్ మీద వాహనాలు నడిపేవారికి కంపు వాసన వస్తున్న, పట్టించుకునే నాధుడే లేదు. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ లీక్ అవ్వడంతో దోమల స్వైర విహారం బాగా పెరిగిపాయింది. సిటీ లో కొన్ని చోట్ల చెరువులు కుంటలు మొత్తం డ్రైనేజీ మరుగు నీటితో నిండిపోవడంతో, అవన్నీ దోమలకి అడ్డా లాగ మారిపోతున్నాయ్. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున భవన నిర్మాణలు జరగడం కూడా దోమలు పెరగడానికి కారణం అని చెప్పొచ్చు.  చెరువులు, కుంటలకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో దోమల దండయాత్రకు విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. వారానికి ఒక్కసారి అయిన జ్వరాల బారిన పడే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది.చాల చోట్ల దోమల దెబ్బకి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాలతో సిటీ వాసులు మంచం పడుతున్నారు. దోమల దండయాత్ర నుండి తప్పించుకోడానికి జెట్ కాయిల్స్,అగర్బత్తి , ఆల్ అవుట్ లాంటివి వాడుతున్నప్పటికీ పెద్ద ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారు. 


మణికొండ నెక్నాంపూర్ చెరువు ,మీర్ ఆలం ట్యాంక్, నల్లగండ్ల చెరువు, లంగర్ హౌస్,  కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, చాదర్ ఘాట్, దిల్‌సుఖ్‌నగర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ అంతటా దోమల దండయాత్ర భయంకరంగా ఉంది. మూసీ ప్రాంతం, మణికొండలో అయితే దోమల తాకిడి భయానకంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా జి.హెచ్.ఎం.సి మాత్రం కనీస దోమల నివారణ చర్యలు తీసుకోవట్లేదు. గ్రేటర్ పరిధిలో  ఉన్న సగం జోన్లలో సీనియర్ ఎంటమాలజిస్ట్, చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్టులు ఖాళీ ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శం అని చెప్పాలి.ఇంతకు ముందు కోల్డ్ ఫాగింగ్ అని సిటీ లో అన్ని చోట్ల దోమల నివారణ కార్యక్రమం జరిగేది, కానీ ఏడాది కాలంగా అవన్నీ జీహెచ్‌ఎంసీ  ఆపేసింది. ఇంకో వైపు జీహెచ్‌ఎంసీ వార్మ్ ఫాగింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని హడావిడి చేసినప్పటికీ, అది ప్రకటనలకే పరిమితం అయింది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ మొద్దు నిద్ర వదిలి సిటీలో అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ చేసి దోమల బెడద తగ్గించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa