తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యమంటూ పదే పదే ఉద్ఘాటిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ మేరకు రకరకాల కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అయితే.. ఇప్పటికే.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు అదే మహిళలను ఆ బస్సులకు ఓనర్లను చేసే కార్యక్రమానికి నడుం బిగించింది.
స్వయం ఉపాధిలో భాగంగా మహిళా సంఘాలకు.. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అయితే.. ఇందుకు సంబంధించి.. మంగళవారం (మార్చి 04న) రోజున ఉత్తర్వులను రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసింది. కాగా.. ఈ కార్యక్రమమంలో తొలి విడతగా 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్టు తెలిపింది. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద రూ.77,220 ప్రభుత్వం చెల్లించనుంది.
అయితే.. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీని కూడా ప్రభుత్వమే ఇవ్వనుండటం విశేషం. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపించే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మొదలుపెట్టబోతోంది. అయితే.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రత్యేక సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజునే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని మహిళలంతా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాగా.. మహిళలకు కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించటమే కాదు.. ఆ ప్రయాణాలు చేసే బస్సులకు ఓనర్లను చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పించింది. ఈ మేరకు.. మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించి.. మహిళా దినోత్సవానికి బిగ్ గిఫ్ట్ ఇవ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa