రేపటి (మార్చి 12) నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ వస్తారని కేటీఆర్ చెప్పటంతో.. మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. సమావేశాల్లో అవలంభించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. అయితే.. కేసీఆర్ చేసిన సూచనలు చూస్తుంటే.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చే అన్నట్టుగా సాగేలా ఉన్నాయి.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నిర్ణీత సమయం కంటే ఒక అర్ధగంట ముందే సభకు హాజరుకావాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై అసెంబ్లీలో చీల్చి చెండాడాలని సూచించారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను పూర్తి స్థాయిలో తిప్పి కొట్టాలని కేసీఆర్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలతో పాటు మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని నేతలకు కేసీఆర్ సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలని సూచించారు.
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని కేసీఆర్ సూచించారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గురించి.. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలన్నారు. దళితబంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలన్నారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa