"నాకు నలుగురు కొడుకులు. అయినా అన్నం పెట్టే దిక్కులేదు. 16 ఎకరాలుంటే అందరికీ సమానంగా పంచిచ్చా. కానీ నన్ను పెన్షన్ కోసం ఇంట్లో నుంచి గెంటేశారు నా కొడుకులు." అంటూ 89 ఏళ్ల వృద్ధ తండ్రి ప్రజావాణి వద్ద తన ఆవేదన వెల్లగక్కాడు. హృదయం దహించి వేసే ఈ ఘటన.. హన్మకొండ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కనిపించింది. నడించేందుకు కూడా ఒంట్లో చేవలేని స్థితిలో.. చక్రాల కుర్చీలో కూర్చుని ప్రజావాణికి వచ్చి మరీ ఫిర్యాదు చేశారంటే ఆ ముదిమి మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ వృద్ధ తండ్రి ఎవరూ.. ఆయన కథేంటో ఓసారి తెలుసుకుందాం.
కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన పిల్లల నారాయణ.. ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన వయసు ప్రస్తుతం 89 ఏళ్లు. నారాయణకు నలుగురు కుమారులు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. ఒకరు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూనే, అటు వ్యవసాయం చేసుకుంటూ తన కష్టార్జితంతో 16 ఎకరాలు సంపాధించాడు నారాయణ. తనకు ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులు ఎవరికీ చేయి చాచకుండా బతికిన నారాయణ.. చేతగాని రోజుల్లో తమ కుమారులే తనను చూసుకుంటారని ధీమాతో.. తమ పేరు మీద ఏమాత్రం ఆస్తి ఉంచుకోకుండా మొత్తాన్ని పంచేశాడు. తన పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని నలుగురు కుమారులకు సమానంగా పంచేశాడు.
తనకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తూ.. ఎవరిని ఏమీ ఆశించకుండా కాలం వెళ్లదీస్తున్నాడు నారాయణ. అయితే.. ఇన్ని రోజులు తనకు తోడుగా ఉన్న భార్య కాలం చేయటంతో.. నారయణ ఒంటరైపోయాడు. పైగా.. వయసు కూడా మీదపడటంతో.. ఒంట్లో సత్తువ లేకుండా పోయింది. మీది నుంచి వయసురిత్యా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా. ఈ క్రమంలో.. తన పింఛన్ డబ్బులే తన ఖర్చులకు, ఆస్పత్రి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి.
అయితే.. వయసు మీద పడటంతో.. తండ్రికి సేవ చేయాల్సిన బాధ్యత కుమారుల మీద పడింది. దీంతో.. నలుగురు కుమారులు సమానంగా ఆస్తినైతే పంచుకున్నారు కానీ.. మరి తండ్రి యోగక్షేమాలు చూసుకునే విషయంలో మాత్రం లెక్కలు వేసుకున్నారు. తండ్రిని చూసుకుంటున్నందుకు ఆయనకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా ఇవ్వాలంటూ కక్కుర్తి పడ్డారు ఆ కొడుకులు. చివరి రోజు వరకు ఎవరికీ చేయి చాచకుండా ఉండాలనుకున్నాడో ఏమో నారాయణ మాత్రం.. ఆస్తి ఇచ్చాను కదా ఇంకా ఈ పింఛన్ డబ్బులు కూడా ఆశపడతారా అని కొడుకులను మందలించాడు.
అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ముగ్గురు కుమారులు పింఛను డబ్బుల కోసం వేధిస్తూ.. ఇంటికి తాళం వేసి తనను బయటకు గెంటేశారంటూ.. ప్రజావాణికి వచ్చి గోడు చెప్పుకున్నాడు నారాయణ. ప్రస్తుతం అదే ఊళ్లో అద్దె ఇంట్లో ఉంటున్నానని, కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద కన్నీరు మున్నీరయ్యారు కొడుకుల బాధితుడు 89 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa