మొన్నటివరకు కుగ్రామం. ఇప్పుడు రాష్ట్రమంతా ఆ ఊరివైపే చూస్తోంది. కూతవేటు దూరంలోనే జాతీయ రహదారి ఉన్నా బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని ఆదివాసీలుండే ఆ చిన్న పల్లెలో.. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రాష్ట్ర గవర్నరే వచ్చి ఆ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. స్వయంగా మంత్రే దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంతకూ ఆ గ్రామం ఏంటీ.. అసలు ఎందుకు ఆ గ్రామానికి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేసేయండి..?
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి అనే కుగ్రామం ఉందని బయటి ప్రపంచానికి చాలా వరకు తెలియదు. కానీ.. ఈ గ్రామంలో 68 కుటుంబాలు ఉంటాయి. 324 మంది జనాభా ఉన్నారు. జాతీయ రహదారికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ.. కొండపర్తి గ్రామానికి సరైన రవాణా మార్గం లేక.. బయటి సమాజంతో పెద్దగా సంబంధాలు లేకుండా పోయింది. దాదాపు ఐదేళ్ల కిందటే.. గిరిజన సంక్షేమశాఖ రూ.కోటి అంచనా వ్యయంతో గ్రామానికి తారు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ.. అటవీశాఖ అభ్యంతరంతో పనులు అక్కడే ఆగిపోయాయి. గ్రామానికే కాదు.. ఊరిలో కూడా రోడ్లు ఉండవు, డైనేజీ వ్యవస్థ కూడా లేక రోడ్లపైకే మురుగు ప్రవహిస్తుంటోంది. దశాబ్దాల కింద కట్టిన, శిథిలావస్థలో ఉన్న చిన్న భవనంలోనే స్కూల్ నడుస్తోంది. ఇది కొండపర్తి గ్రామ పరిస్థితి.. కాదు కాదు దుస్థితి.
ఇలాంటి గ్రామానికి.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా.. 2024 ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలు, టోర్నడో వల్ల.. కొండపర్తి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒకేసారి ఎకరాల మేర చెట్లన్నీ నేలకూలాయి. అదే సమయంలో కొండపర్తి గ్రామంలో ఏకంగా 18 ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఒకేచోట భారీ ఎత్తున చెట్లు నేలకూలడమనేది.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపింది. ఈ సందర్భంగా.. మంత్రి సీతక్క, జిల్లా అధికారులు ఆ అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే.. పక్కనే ఉన్న కొండపర్తి గ్రామాన్ని కూడా సందర్శించగా.. అక్కడి దీన పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
కొండపర్తి గ్రామ దుస్థితి గురించి మీడియాలో పలు వార్తలు రావటంతో.. ఆ ఊరి గురించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలుసుకున్నారు. ఆ ఊరి పరిస్థితి విని చలించిపోయిన జిష్ణుదేవ్ వర్మ.. వెంటనే ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కొండపర్తిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు గవర్నర్ ఆదేశాలిచ్చారు.
గవర్నర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. ఊరు మొత్తం పరిశీలించి.. అక్కడి ప్రధాన సమస్యలను గుర్తించారు. అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించారు. కొండపర్తిని అభివృద్ధి బాట పట్టించడంలో భాగంగా మొదట గ్రామస్తులందరికీ పక్కా ఇళ్లు కట్టించే పనికి శ్రీకారం చుట్టారు. గ్రామం మొత్తంలో రెండే పక్కా ఇళ్లు ఉండగా.. మిగతా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.68 లక్షలు వెచ్చి రెడ్కో ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సొలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
గ్రామంలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్లతో పాటు.. మురుగు నీటి కాల్వలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.70 లక్షలతో రెండు కమ్యూనిటీ భవన నిర్మాణాలు ప్రారంభించారు. గ్రామంలోని పురుషులు, మహిళలను ఐదు టీమ్లుగా విభజించి, విస్తరాకుల తయారీ, కుట్లు, అల్లికలు, శానిటరీ వస్తువులు, మసాలల తయారీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. దీంతో.. కొండపర్తి రూపురేఖలు మారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్థానిక మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం (మార్చి 11న) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.35 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ భవనంలోనే.. మహిళలు, యువతకు వృత్తి, నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. టైలరింగ్, మసాలా తయారీ కేంద్రాలకు సంబంధించిన భవనాలు ప్రారంభించారు. మహిళలకు కుట్టుమిషన్లు కూడా పంపిణీ చేశారు.
మరోవైపు.. రూ.10 లక్షలు వెచ్చించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు రిపేర్లు చేసి ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను కూడా గవర్నర్ ప్రారంభించారు. రూ. 6.50 లక్షలతో ఏర్పాటు చేసిన కుమ్రంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. 300 ఎకరాల భూమికి సాగునీరు అందేలా ఇందిరా జలప్రభ పథకం కింద వేసిన బోర్లను మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఆదివాసీలు తమ సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa