ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న హైదరాబాద్ మెట్రో స్టేషన్ల సంఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 06:10 PM

హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకు అనుమతులు లభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే.. ప్రస్తుతం ఉన్న మెట్రో విస్తరణకు కీలక అడుగులు పడుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం చెక్కులను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 500 చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వం.. మొత్తం వీటి కోసం రూ.200 కోట్లకు పైగా పరిహారం అందజేశారు. ఒక్క గజానికి రూ.81 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. అంతే కాదు.. పూర్తిగా నిర్వాసితులు అయిన వారికి పునరావాస పరిహారం కూడా చెల్లిస్తున్నారు. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పనుల వేగం కాస్త నెమ్మదించినా.. విస్తరణ కోసం గుర్తించిన ఆస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ సంస్థ 8 నెలల్లో పనులను పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


మెట్రో రెండో దశలో భాగంగా ఐదు లైన్లను రానున్న నాలుగేళ్లల్లో పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే మొదట పాతబస్తీలో పనులను మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే ప్రధాన పనులను చేపట్టేందుకు ఆస్తుల సేకరణ, విస్తరణపై దృష్టి పెట్టనున్నారు. రెండో దశలో నిర్మించబోయే 76.4 కిలో మీటర్ల మార్గంలో.. ఎంజీబీఎస్ నుంచి చంద్రయాణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మించనున్నారు. దీనికి పరిహారం డబ్బులు కాకుండా.. రూ.2,714 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఆస్తుల సేకరణకు సుమారు రూ.1000 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది.


 ఈ మార్గంలో మొత్తం 11 వందల ఆస్తులను అధికారులు గుర్తించగా.. వీటిలో 980 నిర్మాణాలను తొలగించాల్సి వస్తోంది. వీరిలో ఇప్పటి వరకు 400 నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిలో 325 మంది నుంచి ఆమోదం లభించింది. వీటిలో 80 ఆస్తులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. 39 నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు.. మరో 41 నిర్మాణాలకు కూల్చివేతల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలోని మెట్రో విస్తరణలో భాగంగా.. మతపరమైన కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం నివాసాలు, దుకాణాలు మాత్రమే తొలగిస్తున్నారు.


అయితే రెండో దశ మెట్రోకు స్టేషన్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మధ్య రెండవ దశలో ప్రతిపాదిత మెట్రో రైలు విస్తరణలో చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ స్టేషన్లు ఉండాలని ఇటీవలే అధికారులు ప్రతిపాదించారు. పాతబస్తీ వరకు వచ్చే మెట్రో మార్గంలో కూడా మెట్రో స్టేషన్లు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa