ట్రెండింగ్
Epaper    English    தமிழ்

65 జాతీయ రహదారిపై తగ్గనున్న టోల్‌ ట్యాక్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 31, 2025, 10:49 AM

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్‌ట్యాక్స్ ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుంది. హైదరాబాద్‌-విజయవాడ మార్గానికి సంబంధించి తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్‌ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.అటు ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్‌ రుసుములో 25 శాతం మినహాయింపు లభిస్తుందని ఎన్‌హెచ్ఏ ప్రకటించింది. తగ్గించిన టోల్ ట్యాక్స్‌లు ఏడాది పాటు అనగా.. 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.గతేడాది జులై 1 నుంచి టోల్‌ వసూళ్లు ఎన్‌హెచ్‌ఏఐ చేతికి వెళ్లాయి. అంతకుముదు వరకు కూడా జీఎమ్మాఆర్ సంస్థ టోల్ వసూలు చేసేది. 2024, జూలై 1 నుంచి ఈ బాధ్యతను ఎన్‌హెచ్ఏఐ తీసుకుని.. ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేపడుతోంది. గతంలో జీఎమ్మార్‌ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్‌ ట్యాక్స్‌లను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యత ఎన్‌హెచ్‌ఏఐ చేతికి రావడంతో.. ఆ సంస్థ టోల్‌ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa