ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనంతో మమేకమవుతున్న సీఎం,,, సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 06:00 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తర్వాత సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.. ఎంతో మంది నిరుపేదల ఇండ్లలో ప్రతి రోజు పండుగను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత చేరువ చేయడమే కాకుండా, ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల్లో ప్రదర్శించేందుకు ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లలోనే భోజనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు మంత్రులు లబ్ధిదారుల ఇళ్లల్లో భోజనం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే.. ఏప్రిల్ 6న (ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం.. ఆయన భద్రాచలం దగ్గర ఉన్న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చేరుకుని, అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. లబ్దిదారుల కుటుంబంతో కలిసి అత్యంత సామాన్యుడిలా నేలపై కూర్చొని భోజనం చేశారు.


 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు లబ్ధిదారుని ఇంటిని ముందుగా పరిశీలించారు. భద్రతా పరంగా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ నిర్వహించారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం పట్లం బూరం శ్రీనివాసరావు కుటుంబం హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలతో మమేకమై, సన్నబియ్యం పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.


అంతకుముందు.. భద్రాచలం సీతారాముల ఆలయానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి హోదారో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa