సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడి ప్రమాద విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ సింగపూర్ పయనమయ్యారు. మరోవైపు.. ఈ ప్రమాద విషయం తెలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముకులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. పవన్ కళ్యాణ్కు ధైర్యం చెప్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి… శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్… సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడటం… దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను." అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురవటం ఆందోళనకరమని.. గాయాలపాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు కొండా సురేఖ తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
ఇదే క్రమంలో.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనైనట్టు కేటీఆర్ తెలిపారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా.. ట్విట్టర్లో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు.
వీళ్లే కాకుండా.. ఈ ప్రమాద విషయం తెలిసి చాలా మంది రాజకీయ నేతలు తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల వేదికగా స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదే క్రమంలో.. పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు.
అయితే.. పవన్ కళ్యాణ్, అన్న లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 08న) ఉదయం పాఠశాలలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగటంతో.. మార్క్ శంకర్తో పాటు మరో 14 మంది చిన్నారులకు తీవ్రంగా గాయపడ్డారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో.. గాయపడిన పిల్లలందరినీ స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈరోజు (ఏప్రిల్ 08న) అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉండగా.. ఈ ప్రమాదం గురించి తెలిసింది. కాగా.. తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa