సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ పాత గోదాములో భారీగా నగదు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు రూ. 8 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన సికింద్రాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పోలీసు వర్గాల కథనం ప్రకారం, సికింద్రాబాద్లోని ఒక పాత గోదాములో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ గోదాంపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి వారు ఆశ్చర్యపోయారు. తక్షణమే ఆ నగదును భద్రపరిచి, పోలీస్ స్టేషన్కు తరలించారు.స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ డబ్బంతా నగరంలోని ఏటీఎంలలో నగదు నింపే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందినదని పోలీసులు నిర్ధారించారు. ఆ ఏజెన్సీ తమ సిబ్బందికి గత కొంతకాలంగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, దీంతో ఆగ్రహించిన సిబ్బంది సుమారు వారం రోజులుగా విధులను బహిష్కరించారని తెలిసింది.సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో, ఏటీఎంలలో జమ చేయాల్సిన నగదు భారీగా ఏజెన్సీ వద్ద పేరుకుపోయిందని పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని భద్రపరిచే సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏజెన్సీ నిర్వాహకులు ఆ డబ్బును ఈ పాత గోదాములో దాచిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై బాధ్యులైన ఏటీఎం ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa