ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీలకే కొత్తగా రూ.1.58 లక్షల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 06:44 PM

తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8.15 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ డబ్బంతా ఎక్కడకి పోయిందో కూడా తెలియడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే తమ ప్రభుత్వం కొత్తగా రూ.1.58 లక్షల కోట్లు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించారు.సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామని, తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8.15 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా ఎలా మారిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా దివాలా తీస్తే, కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ఎలా సమకూరాయని ఆయన నిలదీశారు. నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు కూడా లేకుండా ధర్నా చౌక్‌ను మూసివేయడాన్ని ఆయన తప్పుపట్టారు.ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని వివరించారు. ప్రభుత్వానికి ప్రతినెలా సుమారు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో రూ.6 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల కిస్తీలకు, మరో రూ.6 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోందని తెలిపారు. రాష్ట్ర కనీస అవసరాలు తీరాలంటే నెలకు రూ.22 వేల కోట్లు అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డిమాండ్లు రావడం సరికాదని అన్నారు.సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వమే మిగిల్చిందని, ఆర్థిక వనరులు లేకున్నా అడ్డగోలుగా అప్పులు తెచ్చారని ఆరోపించారు. యువతకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.తమ ప్రభుత్వం కూలిపోవాలని మాజీ సీఎం కేసీఆర్ రోజూ శాపనార్థాలు పెడుతున్నారని, అయితే పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్‌ను 'కపట నాటక సూత్రధారి'గా అభివర్ణించిన సీఎం, ప్రజలు ఆయన మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని హెచ్చరించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa