ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై.. రేపు సెక్రటేరియట్‌లో కీలక భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 06:29 PM

తెలంగాణలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లలో దారుణంగా ఫీజులు ఉంటున్నాయి. నర్సరీ నుంచి లక్షల్లో ఫీజులు వస్తూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం కింద బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు వంటి కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం (మే 12) సమావేశం కానుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా.. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 2024 జూలైలో ఏర్పాటైంది. ఈ కమిటీ ఇదివరకే ఒకసారి సమావేశం కాగా.. మంగళవారం సచివాలయంలో రెండోసారి భేటీ కానుంది.


ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర విద్యా కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి, 'తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025' పేరుతో జనవరి 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గతంలో ఫీజుల నియంత్రణకు జీవో జారీ చేసినప్పటికీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా అది నిలిచిపోయింది. అందువల్ల, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని కమిషన్ అభిప్రాయపడింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఫీజుల నియంత్రణపై లోతుగా చర్చించనున్నారు.


మరోవైపు, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12 1(సీ)ని వచ్చే విద్యా సంవత్సరం నుండి తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అయితే, ఇది జరిగితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. కర్ణాటక తరహా విధానాన్ని అమలు చేస్తే, ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో మాత్రమే ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. దీని కోసం గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.


మరికొందరైతే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టుతో ముడిపడి ఉన్నందున, ఈ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే, ఫీజుల నియంత్రణపై మాత్రం ప్రభుత్వం మరికొంత సమయం తీసుకుంటుందా? లేదా తక్షణమే ఒక నిర్ణయం ప్రకటిస్తుందా? అనేది వేచి చూడాలి. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa