ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరంతా అటు వైపే..... పట్టరాని సంతోషంలో మత్స్యకారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 06:33 PM

నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నాయనం గ్రామ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో మత్స్యకారులు అదృష్టం వరించింది. ఉదయం వేళ చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో భారీ బొచ్చ చేప చిక్కింది. 34 కిలోల బరువున్న ఆ చేపను చూసేందుకు గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇంత పెద్ద చేపను పట్టుకున్న మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


ఇటీవల కాలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఇలాంటి భారీ చేపలు దొరకడం సాధారణ విషయంగా మారింది. కొన్ని నెలల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఒక మత్స్యకారుడికి 25 కిలోల చేప చిక్కింది. దీంతో ఈ ప్రాంతం భారీ చేపల వేటకు ప్రసిద్ధి చెందింది. ఆ ప్రాంతంలో ఇటువంటి చేపలు భారీగానే ఉంటాయన్న ఆలోచనకు చాలా మంది వచ్చేశారు. నెలలో ఒక్కరోజైనా ఇలాంటి చేప పడకపోయిద్దా అనే ఆశతో వలలు విసురుతుంటారు.


మత్స్యకారుల జీవన విధానం..


మత్స్యకారుల జీవితం ఎంతో కష్టతరంగా ఉంటుంది. తెల్లవారుజామునే నిద్రలేచి, పడవలు, వలలు తీసుకుని నదిలోకి చేపల వేటకు వెళ్తారు. వారి జీవితం నీటితో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాలకు తెగించి చేపల వేటకు వెళ్లాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోయినా.. కుటుంబం గడవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లక తప్పదు. చేపలు దొరికిన రోజు వారికి పండగే. దొరకని రోజున నిరాశతో వెనుదిరుగుతారు.


చేపలు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వైద్యులు కూడా వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినమని సూచిస్తున్నారు.


చికెన్, మటన్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చేపలు చికెన్, మటన్ కంటే చౌకగా దొరుకుతుండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. వారికి ఆధునిక పడవలు, వలలు అందిస్తోంది. చేపల పెంపకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.


ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా, పొచ్చర వాగులో ఒక అనూహ్య దృశ్యం దర్శనమిచ్చింది. 14 కిలోల బరువున్న జెల్ల చేప వాగులో పడింది. ఈ అరుదైన చేపను చూసేందుకు గ్రామస్థులు ఒకే చోటా చేరిపోయారు. వాగులో గుమ్ముల అశోక్‌ అనే ఒక మత్స్యకారుడు.. తన అనుభవంతో ఆ చేపను పట్టుకున్నారు. మొదట ఈ చేప 10 కిలోల వరకు ఉంటుందనుకున్నాడు.. తీరా దానిని భయటకు తీసి బరువు జోకే సరికి అతడే షాక్ అయ్యాడు. అతడికి 14 కిలోల చేప లభించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పెద్ద చేపలు వలకు చిక్కుతూనే ఉన్నాయి.. కానీ ఇక్కడ మాత్రం 34 కిలోల చేప వలకు చిక్కడంతో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దీని గురించే చర్చించుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa