కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రాజెక్టు ఇంజినీర్లు, కీలక అధికారులు, కాంట్రాక్టర్లను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్కు జూన్ 5న డెడ్లైన్గా విధించారు. కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. సమన్లకు రిప్లయ్ ఇచ్చేందుకు 15 రోజులు గడువిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం కేసీఆర్ సహా.. నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చారు. జాన్ 5 కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటలను విచారణకు రావాలన్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జులై నెలాఖరు వరకు సమయం పెంచింది. ఇటీవల విచారణ పూర్తి చేసిన కమిషన్ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలపై గత ఏడాది నుంచి విచారణ చేపట్టిన ఈ కమిషన్ డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలను పరిశీలించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన విషయాలపై ఇంజినీర్లు, అధికారులను ప్రశ్నించింది.
అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ప్రభుత్వం కమిషన్ గడువును ఇప్పటికి ఏడుసార్లు పొడిగించింది. ఈ నెల 21 లేదా 22న నివేదిక సమర్పించాల్సి ఉండగా.. విచారణలో పలువురు అధికారులు గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని చెప్పడంతో, కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa