నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ మెట్రో.. టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టికెట్ ధర మీద 20 శాతం పెంచింది. మే 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే ఒకేసారి ఇంత భారీ మొత్తంలో టికెట్ ధరలు పెంచడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను తగ్గించింది. ఆ వివరాలు..
పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు వెల్లడించింది. 20 శాతం పెంపుతో కనిష్ట టికెట్ ధర రూ.10 నుంచి 12 రూపాయలకు పెరిగింది. గరిష్ట టికెట్ ధరను రూ.60 నుంచి 75 రూపాయలకు పెంచారు. ప్రయాణికులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఓ మెట్టు దిగి వచ్చిన ఎల్ అండ్ టీ కంపెనీ.. టికెట్ ధరలను 10 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు మే 24 నుంచి అమల్లోకి రానున్నాయి.
కరోనా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల మెట్రోలో రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. దీంతో మెట్రో ఆదాయం భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. దీన్నుంచి బయటపడాలంటే.. టికెట్ ధరలను పెంచడమే మార్గం అని భావించి.. ఒకేసారి ఏకంగా 20 శాతం పెంచింది. దీని వల్ల సంస్థకు అదనంగా నెలకు రూ.150 - రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో.. 20 శాతం పెంపును 10 శాతానికి కుదించారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రధాన రవాణా సాధనంగా మారింది. తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా.. నగరం ఓ మూల నుంచి మరో మూలకు ప్రయాణం చేయాలనుకునే చాలా మంది మెట్రోరైలును ఆశ్రయిస్తున్నారు. ప్రారంభంలో జనాలు మెట్రో పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం రోజుకు దాదాపుగా 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీని తర్వాత.. ISB, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతోపాటు హార్వర్డ్ యూనివర్సిటీ సైతం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విజయ గాథపై అధ్యయన పత్రం ప్రచురించింది.
ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గ్, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో మెట్రో పరుగులు పెడుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్దమైంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశలోని.. రెండో భాగం (2బి) విస్తరణ ప్రణాళిక దాదాపు 19 వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. దీనిలో భాగంగా, మూడు ప్రత్యేక మార్గాల్లో మొత్తం 86.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలను విస్తరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa