తెంలగాణలోని పేద రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల మధ్య గట్ల పంచాయితీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే సర్వే నిర్వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మంచిర్యాలలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేద రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వీరికి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాగు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే జూన్ 2 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సదస్సుల్లో ఎమ్మార్వో స్థాయి అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్యాక్రాంతానికి గురైన పేదల భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని అర్హులైన పేదలకే పంచుతుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, రెవెన్యూ అధికారులు ఈ చట్టాన్ని రైతులకు నిజమైన సహాయకుడిగా మార్చాలని ఆయన సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం కోసం తమ అధికార బృందం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలోని ఉత్తమ అంశాలను గ్రహించి భూభారతిని రూపొందించామని ఆయన వివరించారు. ఈ చట్టాన్ని తయారు చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని మంత్రి తెలిపారు. మొదటి దశలో నాలుగు మండలాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం సాదాబైనామా కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని 2020 ఆర్వోఆర్ చట్టంలో సాదాబైనామా అంశాన్ని చేర్చలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సాదాబైనామా అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa