హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో కబ్జాకు గురైన విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.200 కోట్ల విలువ చేసే రెండెకరాల పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 41లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నాలాతో పాటు పార్కుకు కేటాయించిన రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఒక వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని, ఆ ఇంటి యజమానికి తెలియకుండానే చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూమిని కబ్జా చేశాడు. ఈ ఆక్రమిత స్థలంలో హోటల్, హాస్టల్ నిర్వహణకు అద్దెకిచ్చి నెలకు రూ.10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడు.ఈ అక్రమ వ్యవహారంపై ఇంటి యజమాని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గతంలోనే సదరు కిరాయిదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆక్రమణదారుడు ఈ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ఆక్రమిత నిర్మాణాలపై అతనికి ఎలాంటి హక్కులు లేవని తేల్చి చెప్పింది. ప్రభుత్వ నాలా, రహదారిని ఆక్రమించి భవనాలు ఎలా నిర్మిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ అక్రమ కట్టడాలను తొలగించాలని హైడ్రాను ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. భారీ బుల్డోజర్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ స్థలంలో త్వరలోనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడేలా చక్కటి పార్కును ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa