ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ నాటికి సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:32 PM

హైదారాబాద్ కు కృష్ణాజలాల తరలింపుకోసం చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.మంగళవారం మేఘా ఇంజనీరింగ్ సీఈఓ, డైరెక్టర్, హైద్రాబాద్ ఐఐటి  ప్రొఫెసర్లు, టీసీఎస్, గేట్ల ఎక్స్ పర్ట్ కన్నయ్య నాయుడు, ఇతర నిపుణులతో కలిసి ఆయన సుంకిశాల ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు.జలమండలి ఎండీ ఉన్నత అధికారులతో కలిసి పైపులైను విస్తరణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు మిగిలిపోయిన పైపులైను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పైపులైను నిర్మాణ నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులకు ఆయన సూచించారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో పైపు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు.అనంతరం నిర్మాణ సంస్థ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర నిపుణులతో కలిసి సుంకిశాల పునర్నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రెడీజైనింగ్ సంబంధించిన వివరాలను నిపుణులతో చర్చించారు. అలాగే శిథిలాల తొలగింపు అనంతరం సివిల్ వర్క్ లు, కంట్రోల్ రూం పనులను వేగంగా ముగిస్తే సైడ్ వాల్ పునర్నిర్మాణానికి మార్గం సులభం అవుతుందని అంచనా వేశారు.అనంతరం నాగార్జున సాగర్ జలాశయం వైపు ఉన్న టన్నెలింగ్ ప్లగ్గింగ్ పనులను పరిశీలించారు. అలాగే ప్రతీ టన్నెలింగ్ వద్ద గేట్ల నిర్మాణం, డిజైన్లను సంబంధించిన వివరాలను నిపుణుడు కన్నయ్య నాయుడు తో చర్చించారు.ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే పైపులైను విస్తరణ పనులు 4 కిలోమీటర్లు మినహా మిగతా ప్రాంతాలలో పూర్తి చేశామని, ఎలక్ట్రిక్ పనులు సైతం చివరి దశకి చేరుకున్నాయని అన్నారు. రిటైనింగ్ వాల్ శిథిలాలను తొలగింపు పూర్తిచేసి పునర్నిర్మాణం పనులు మొదలు పెట్టాలని , దానికి సంబంధించిన డిజైన్ లు, డ్రాయింగ్ లను 15 రోజుల లోగా ఫైనలైజ్ చేయాలని ఆదేశించారు.దానికోసమే నిర్మాణ సంస్థ సీఈవో, డైరెక్టర్, అధికారులు, నిపుణులతో సుధీర్ఘంగా చర్చించారు. పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రాజెక్టును వచ్చే  ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సిజీఎం మహేష్ కుమార్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్లు శశిధర్, సురేంద్రనాథ్, గేట్ల రూపకర్త కన్నయ్య నాయుడు, టీసీఈ ప్రతినిధి నితీష్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa