హైదరాబాద్ నగరంలో నాలాల సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నాలాలపై జరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు, ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని నాలాలపై ఒక ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.రాబోయే నాలుగు నెలల పాటు నాలాల అంశంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వివరించారు. ముఖ్యంగా నగరంలో వరద నీరు తరచుగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.నాలాలు, ఇతర నీటి వనరులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వాటిని తక్షణమే తొలగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, పేదలు నివాసం ఉంటున్న నిర్మాణాల విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, ఆ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa